బీహార్ లో వరద బీభత్సం సృష్టిస్తోంది. పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వరద ఉధృతి పెరిగి… ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 29 మంది మరణించారు. దాదాపు 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. సహాయ పునరావాస చర్యలు చేపట్టేందుకు 32 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. పట్నాలో వరదల్లో చిక్కుకున్న దాదాపు 235 మందిని కాపాడాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. ఇప్పటికే పట్నాలోని అన్ని స్కూళ్లు, కాలేజీలను అక్టోబర్ 1 వరకు సెలవులు ప్రకటించారు అధికారులు. రైల్వే ట్రాక్లపైకి నీరు చేరడంతో పలు రైళ్లను రద్దు చేశారు. మరోవైపు భారీ వర్షపాతంపై తాము రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశామని వాతావరణ శాఖ చెబుతుండగా, బిహార్ సీఎం నితీష్ కుమార్ మాత్రం తమ ప్రభుత్వానికి వాతావరణ విభాగం నుంచి భారీ వర్షాలపై ఎలాంటి నిర్ధిష్ట సమాచారం లేదని చెబుతున్నారు.
