Rajahmundry : నర్సుల ‘ఐటెం సాంగ్’ డాన్స్.. ఇద్దరు సస్పెండ్, మరో 16 మందికి నోటీసులు!

rajahmundry

Rajahmundry : రోగులకు సేవలు అందిస్తూ ప్రాణాలు కాపాడాల్సిన చోట, బాధ్యత మరిచిన నర్సులు ఐటెం సాంగ్‌కు చిందులేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. విధి నిర్వహణలో ఉండి రోగులను పట్టించుకోవాల్సిన సమయంలో, ఆఫీస్ రూమ్‌నే డాన్స్ ఫ్లోర్‌గా మార్చేసి నర్సింగ్ సిబ్బంది రెచ్చిపోయారు. ఒక ఐటెం సాంగ్‌కు నృత్యాలు చేస్తూ వీడియోలు తీసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.

ఈ ఘటనపై వైద్యారోగ్య శాఖ వెంటనే స్పందించి విచారణ చేపట్టింది. ఆసుపత్రి నిబంధనలను ఉల్లంఘించి, విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గాను హెడ్ నర్సులు మెర్సీ, ఈశ్వరీలను తక్షణమే సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దరితో పాటు ఈ డాన్స్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నట్లు భావిస్తున్న మరో 16 మంది నర్సింగ్ సిబ్బందికి కూడా శాఖాపరమైన షోకాజ్ నోటీసులు అందజేశారు.

రోగులు నరకయాతన అనుభవిస్తున్న సమయంలో, ఆసుపత్రి ఆఫీస్ రూమ్‌లో ఇలాంటి పనులు చేయడం తీవ్రమైన క్రమశిక్షణారాహిత్యమని వైద్యారోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోంది.

Also Read :