vizianagaram : అరె..బర్త్ డే రోజే డెత్.. బొబ్బిలి టెకీ మృతి!

vizianagaram

vizianagaram :  విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, అక్కడే ఉద్యోగం సంపాదించి స్థిరపడుతున్న తరుణంలో, పుట్టినరోజు వేడుకల రోజే ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

సింగిరెడ్డి సాయి శ్రీ హరికృష్ణ అనే యువకుడు ఇంజినీరింగ్ పూర్తి చేసి ఎమ్మెస్ కోసం అమెరికా వెళ్లారు. చదువు పూర్తయిన తర్వాత కేవలం మూడు నెలల కిందటే ఆయన అక్కడ ఉద్యోగం కూడా సంపాదించారు. కుమారుడు విదేశాల్లో మంచి స్థాయిలో ఉన్నాడని సంతోషిస్తున్న తల్లిదండ్రులు రమ, శ్రీనివాస్‌లకు శనివారం రాత్రి పిడుగులాంటి వార్త అందింది.

శనివారం హరికృష్ణ పుట్టినరోజు కావడంతో స్నేహితులతో కలిసి ఎంతో ఉత్సాహంగా గడిపారు. అయితే సాయంత్రం సమయంలో సరదాగా చెరువులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

తన పుట్టినరోజే మరణవార్త వినాల్సి వస్తుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. హరికృష్ణ స్నేహితులు ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేయడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హరికృష్ణ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.