Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి తనయగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్, ఇప్పుడు తన తల్లి వారసత్వాన్ని అందుకుంటూ సౌత్ ఇండియాలో పాగా వేస్తోంది. ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో టాలీవుడ్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ఈ భామ, ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా పెద్దితో బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఒక ప్రముఖ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గ్రాజియా ఇండియా (Grazia India) కవర్ పేజీపై మెరిసిన జాన్వీ, తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంది. తనకి దక్షిణాది రాష్ట్రాలతో ఉన్న విడదీయలేని బంధం గురించి మాట్లాడుతూ.. “ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు సంస్కృతులతో నాకు చాలా దగ్గరి సంబంధం ఉంది. అది నా గుర్తింపులో ఒక భాగం. ఆ ప్రాంతాల సంస్కృతి నాకు చాలా సుపరిచితం” అని చెప్పుకొచ్చింది.
తెలుగు, తమిళం అనర్గళంగా..
చాలామందికి తెలియని విషయం ఏంటంటే జాన్వీ కపూర్ తమిళం చాలా చక్కగా మాట్లాడుతుంది, అలాగే తెలుగు కూడా నేర్చుకుంది. ముంబైలో తన తండ్రి బోనీ కపూర్, చెల్లెలు ఖుషీ కపూర్తో కలిసి నివసిస్తున్నప్పటికీ.. హైదరాబాద్, చెన్నై నగరాలకు తరచుగా వస్తూ ఉంటానని తెలిపింది. అంతేకాకుండా, తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం తనకి ఎంతో ఇష్టమని, తన మూలాలను ఎప్పుడూ మర్చిపోనని ఈ బ్యూటీ స్పష్టం చేసింది.
త్వరలోనే రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది జాన్వీ. ఈ క్రమంలో ఆమె చేసిన కామెంట్స్ తెలుగు అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి.
