ఈ మధ్యే అమెరికా వెళ్లొచ్చిన…. సిర్పూర్ కాగజ్ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులను క్వారంటైన్ లో ఉంచాలని ఉన్నతాధికారులను ఆదేశించారు జిల్లా వైద్యాధికారి. ఈ మేరకు శుక్రవారం ఆసిఫాబాద్ డీఎంహెచ్వో ఎమ్మెల్యే కోనప్పకు ప్రభుత్వం తరపున లేఖ కూడా పంపారు. 14 రోజులపాటు ఇంట్లోనే ఉండాలని, ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనద్దని, ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని కోరారు. లేఖ ప్రతుల్ని జిల్లా ఎస్పీకి కూడా పంపి, అవసరమైన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు.
మరోవైపు తెలంగాణలో కరోనా పాజిటివ్ బాధితులసంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. శుక్రవారం ఒక్క రోజే తెలంగాణలో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు ఉదయం ఇద్దరిని కరోనా పాజిటివ్గా గుర్తించగా.. తాజాగా మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతోపాటు లండన్లో చదువుకుంటున్న 18 ఏళ్ల యువతికి కూడా శుక్రవారం కోవిడ్ పాజిటివ్ తేలింది. దీంతో తెలంగాణలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది.