Madhya Pradesh : నల్లగా ఉన్నావని భర్తను నైస్ గా లవర్తో లేపేసింది

madhya pradesh

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో జరిగిన ఒక వ్యక్తి హత్యోదంతం.. వెన్నులో వణుకు పుట్టించే క్రైమ్ డ్రామాను తలపిస్తోంది. తొలుత దొంగతనం కోసం జరిగిన హత్యగా భావించిన ఈ కేసులో, భార్యే అసలు సూత్రధారి అని తేలడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. అవమానం, వివాహేతర సంబంధం, కుట్రతో కూడిన ఈ దారుణ ఉదంతం వివరాలు ఇలా ఉన్నాయి:

మృతుడు దేవకృష్ణ సోదరి జ్యోతి వాంగ్మూలం ప్రకారం.. దేవకృష్ణ భార్య ప్రియాంక (25) తన భర్తను నిరంతరం వేధిస్తూ ఉండేది. “నువ్వు నల్లగా ఉన్నావు, నన్ను పొందే అర్హత నీకు లేదు” అంటూ అతడి రంగును గేలి చేస్తూ అవమానించేది. అంతేకాకుండా, ప్రియాంకకు 2020 నుంచే మరో వ్యక్తితో సంబంధం ఉందని జ్యోతి ఆరోపించారు. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు వెళ్లినప్పుడు కూడా తన ప్రియుడితో చనువుగా ఉండటం వల్ల ఇంట్లో గొడవలు జరిగేవని ఆమె వెల్లడించారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పెరిగి, వారి బంధం ఎప్పుడో తెగిపోయిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ధార్ జిల్లాలోని గొండిఖేడ చరణ్ గ్రామంలో జరిగిన ఈ సంఘటన మొదట పెద్ద మిస్టరీగా అనిపించింది. అర్థరాత్రి ముగ్గురు, నలుగురు అపరిచిత వ్యక్తులు ఇంట్లోకి చొరబడి, తమను వేర్వేరు గదుల్లో బంధించి, తన భర్తను చంపేసి 3 లక్షల విలువైన నగలు, 50 వేల నగదు దోచుకెళ్లారని ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు లోతుగా విచారించగా అసలు విషయాలు బయటపడ్డాయి. దొంగిలించబడినట్లు చెప్పిన నగలు ఇంట్లోనే దొరకడం, బాధితుడి శరీరంపై ఉన్న గాయాలు చూస్తే అది ఎవరో కావాలని చేసిన దాడిలా ఉండటంతో పోలీసులకు అనుమానం కలిగింది.

అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పరుల్ బేలాపూర్కర్ నేతృత్వంలో విచారణ జరపగా, ప్రియాంక స్టేట్‌మెంట్‌లో పొంతన లేదని తేలింది. మొబైల్ డేటా, ఫోరెన్సిక్ ఆధారాల సహాయంతో పోలీసులు ఆమెను గట్టిగా ప్రశ్నించగా, అసలు విషయం ఒప్పుకుంది. ప్రియాంక తన ప్రియుడు కమలేష్‌తో కలిసి భర్తను వదిలించుకోవాలని ప్లాన్ చేసింది. ఇందుకోసం కమలేష్, సురేంద్ర అనే వ్యక్తికి ఒక లక్ష రూపాయలు సుపారీ ఇచ్చి ఈ హత్య చేయించినట్లు విచారణలో తేలింది.

ప్రస్తుతం ఈ కేసులో ప్రియాంక, ఆమె ప్రియుడి పాత్రపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సుపారీ తీసుకున్న సురేంద్ర పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. రంగు పేరుతో భర్తను తక్కువ చేసి చూడటమే కాకుండా, మరో వ్యక్తి కోసం ఏకంగా ప్రాణాలు తీయడం స్థానికంగా సంచలనం సృష్టించింది.