Sabarimala : శబరిమలలో ఉద్రిక్తత.. అయ్యప్ప భక్తుడి తల పగలగొట్టాడు!

sabarimala

Sabarimala : కేరళలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శబరిమలలో ఉద్రిక్తత నెలకొంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులు, స్థానిక వ్యాపారుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. వాటర్ బాటిల్ ధర విషయంలో ప్రశ్నించినందుకు ఓ వ్యాపారి తెలుగు అయ్యప్ప భక్తుడిపై ఏకంగా దాడికి పాల్పడ్డాడు.

ఓ షాపులో తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తుడు వాటర్ బాటిల్ కొనుగోలు చేద్దామని వెళ్లాడు. ఆ బాటిల్‌కు షాపు యజమాని ఎక్కువ ధర చెప్పడంతో .. ఎందుకింత ఎక్కువ ధర అని ఆ భక్తుడు యజమానిని ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన దుకాణ యజమాని వెంటనే గాజు సీసాతో సదరు భక్తుడి తలపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో భక్తుడి తల పగిలి తీవ్ర గాయమై రక్తం వచ్చింది. అంతేకాకుండా హైదరాబాద్‌కు చెందిన మరో అయ్యప్ప భక్తుడి మాలను సదరు వ్యాపారి తెంపేశాడు.

https://twitter.com/pulsenewsbreak/status/1996830395841790006

తెలుగు భక్తుడిపై స్థానిక వ్యాపారి దాడి చేయడంతో, శబరిమలలోని ఇతర తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన భక్తుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, దాడి చేసిన దుకాణం వద్ద నిల్చొని నిరసన తెలిపారు. స్థానిక వ్యాపారులు తరచుగా అధిక ధరలు వసూలు చేయడమే కాకుండా, ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని భక్తులు ఆరోపించారు.

పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుండటంతో, పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘర్షణకు దిగుతున్న వ్యాపారులను, ఆందోళన చేస్తున్న భక్తులను అడ్డుకుంటూ పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. గాయపడిన భక్తుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దాడి చేసిన వ్యాపారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. పండుగ సీజన్‌లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న నేపథ్యంలో ఈ విధమైన సంఘటన జరగడం శబరిమల భద్రత, నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.