Shreyasi Singh : మోడీనా మాజాకా.. షూటర్కు మంత్రి పదవి!

Shreyasi Singh

Shreyasi Singh : బీహార్ లో ఎన్డీయే సర్కార్‌ మరోసారి కొలువుదీరింది. గురువారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణస్వీకారం చేసి నితీష్ కుమార్ రికార్డు సృష్టించారు. గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ఖాన్‌ ఆయన చేత ప్రమాణం చేయించారు. నితీష్ తో పాటు బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా కూడా బీహార్ డిప్యూటీ సిఎంలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

ఇక మంత్రులుగా 26 మంది ప్రమాణం చేశారు. బీజేపీ (14), జేడీయూ (8), ఎల్జేపీ (రామ్‌విలాస్‌) (2), హిందుస్థానీ అవామీ మోర్చా (1), రాష్ట్రీయ లోక్‌ మోర్చా (1) ప్రమాణం చేశారు. ఐదుగురు మొదటిసారి మంత్రలయ్యారు.పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, జేపీ నడ్డాతో పాటుగా ఏపీ సీఎం చంద్రబాబు, ఢిల్లీ సీఎం రేఖ గుప్తా తదితరులు హాజరయ్యారు.

ఇంకో పదిమందికి చోటు

నితీష్ కుమార్ కేబినేట్ లో 36 మందికి చోటు ఉంది. అంటే ఇంకో పదిమందికి చోటు ఉంది. ప్రస్తుతం కేబినేట్ లోకి ముగ్గురు మహిళా మంత్రులను తీసుకున్నారు. వారిలో లేషి సింగ్, రమా నిషాద్, శ్రేయాషి సింగ్ ఉన్నారు. ఈ శ్రేయాషి సింగ్ ఎవరో కాదు.. షూటర్ నుండి రాజకీయ నాయకురాలిగా మారారు. ఈమె కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ కుమార్తె. ఆమె తాత కుమార్ సురేంద్ర సింగ్, నేషనల్ రైఫిల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కూడా. ఆమె తల్లి పుతుల్ కుమారి, మాజీ ఎంపీ.

రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు శ్రేయాషి సింగ్. 2020లో బీజేపీలో చేరిన ఈమె.. జముయి నియోజకవర్గం నుండి పోటీ చేసి, RJD అభ్యర్థి విజయ్ ప్రకాష్‌ను 41,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఓడించారు. ఇక 2025లో RJD అభ్యర్థి మొహమ్మద్ షంషాద్ ఆలంను ఓడించారు. అయితే ఈమెకు ఏ మంత్రిత్వ శాఖ ఇస్తారన్నది చూడాలి.

శ్రేయసి సింగ్‌ అంతర్జాతీయ స్థాయిలో ట్రాప్ షూటింగ్ విభాగంలో దేశానికి ప్రాతినిధ్యం వహించారు. 2014 కామన్వెల్త్ క్రీడల్లో డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో రజత పతకం, 2018 కామన్వెల్త్ క్రీడల్లో డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్నారు. ఆమె చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది.తండ్రి, తల్లి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ, శ్రేయసి సింగ్‌ క్రీడల నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.