PM MODI : నీళ్లు, రక్తం కలిసి ప్రవహించవు.. మోడీ సంచలన కామెంట్స్

PM MODI : 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు త్రివిధ దళాల నుంచి ప్రధాని గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీనుద్దేశించి ప్రసంగించిన మోదీ కీలక కామెంట్స్ చేశారు. ఇది 140 కోట్ల మంది సంకల్ప పండుగ అన్న మోదీ.. సమైక్య భావనతో దేశం ఉప్పొంగే సమయం అని చెప్పారు. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగిరే సమయం.. కోట్ల మంది త్యాగాలతో స్వాతంత్య్రం వచ్చింది-న్నారు.

ఇక పహల్గామ్‌లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారని మోదీ ఫైర్ అయ్యారు. భార్య ముందే భర్తను చంపేశారు, పిల్లల ముందే తండ్రిని చంపేశారు. పాక్‌ ఉగ్రవాదులు మతాన్ని అడిగి మరీ మారణహోమం సృష్టించారు. ఆపరేషన్‌ సిందూర్‌తో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపామని తెలిపారు. మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చామని, పాక్‌లోకి చొచ్చుకెళ్లి మరీ మన జవాన్లు ముష్కరులను మట్టుబెట్టారని చెప్పారు. మన సైన్యం ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిందని, ఉగ్రవాదులను, వారికి మద్ధతిచ్చేవారిని మేం వేర్వేరుగా చూడటంలేదని ఈ సందర్భంగా వెల్లడించారు. మన సైనికులు ఊహకందని విధంగా శత్రువులను దెబ్బతీశారని, పహల్గామ్‌లో దాడి చేసిన ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పాయమన్నారు.

ఇక అణుబాంబు బెదిరింపులను సహించేదిలేదంటూ పాక్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా అణుబాంబుల పేరిట బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని, ఇకపై ఎవరి బ్లాక్‌మెయిల్‌ నడవదన్నారు మోదీ. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడితే ధీటుగా జవాబిస్తామని హెచ్చరించారు . నీళ్లు, రక్తం కలిసి ప్రవహించవంటూ మోదీ కీలక కామెంట్స్ చేశారు. సొంత సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ వైపు దేశ యువత దృష్టిపెట్టాలని మోదీ పిలుపునిచ్చారు. విదేశీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై మనం ఎందుకు ఆధారపడాలన్నారు.

వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని యువ ఇంజినీర్లు, అధికారులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. యంగ్‌ టాలెంట్‌కు అండగా ఉంటానని భరోసాను కల్పి్ంచారు. మేడిన్‌ ఇండియా ఫైటర్‌ జెట్‌ ఇంజిన్లు తయారు చేయాలన్నారు. భూమికి నష్టం కలగకుండా ఫెర్టిలైజర్లు తయారు చేద్దామని, ఎలక్ట్రికల్‌ వాహనాలకు అవసరమయ్యే అన్ని పరికరాలను మనమే తయారు చేసుకుందామన్నారు. స్వదేశీ మంత్రంతో సమృద్ధి భారత్‌కు అడుగులు- వేద్దామన్నారు. భారత్‌ వస్తువులనే కొనుగోలు చేసి ఉపయోగిద్దామని దేశానికి పిలుపునిచ్చారు.