Students : ఎగ్జామ్స్ నుంచి తప్పించుకునేందుకు ఓ ఇద్దరు స్టూడెంట్స్ బరితెగించారు. ఏకంగా కాలేజీ ప్రిన్సిపాల్ చనిపోయినట్లుగా ఓ ఫెక్ లెటర్ ను సృష్టించి, దానిని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరగగా సంచలనం సృష్టించింది. ఇండోర్లోని ప్రముఖ ప్రభుత్వ హోల్కర్ సైన్స్ కళాశాలలో ఈ సంఘటన జరిగింది.
మయాంక్ కచ్వాల్, హిమాన్షు జైస్వాల్ అనే ఇద్దరు బీసీఏ విద్యార్థులు అక్టోబర్ 15, 16 తేదీల్లో జరగాల్సిన ఆన్లైన్ అసెస్మెంట్ పరీక్షలను తప్పించుకునేందుకు పెద్ద స్కెచ్ వేశారు. కాలేజీ అధికారిక లెటర్హెడ్ ఫార్మాట్ను కాపీ చేసి, అందులో ప్రిన్సిపాల్ డాక్టర్ అనామిక జైన్ ఆకస్మిక మరణం కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయని టైప్ చేసి ఒక ఫెక్ లెటర్ ను తయారు చేయించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయించారు.
ఇది క్షణాల్లో వైరల్ కావడంతో పలువురు ప్రొఫెసర్లు, విద్యార్థులు ఆందోళన చెందారు. కొందరు ప్రిన్సిపాల్కి ఫోన్ చేయగా.. మరి కొందరు అయితే ఆమె ఇంటికి కూడా వెళ్లారు. దీంతో విషయం తెలుసుకుని అలర్ట్ అయిన ప్రిన్సిపాల్ డాక్టర్ అనామిక జైన్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.దర్యాప్తు చేసిన పోలీసులు,
ఇది ఇద్దరు విద్యార్థుల పనిగా గుర్తించి, వారిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. డాక్టర్ జైన్ కూడా గతంలో కొంతమంది విద్యార్థుల నుండి వేధింపులను ఎదుర్కొన్నట్లు సూచించింది.