BIG BREAKING : ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ (86) మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆదివారం ఉదయం అధికారికంగా ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై జరిపిన భారీ వైమానిక దాడుల్లో ఆయన మరణించారు. ఖమేనీ మృతికి గుర్తుగా ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. అలాగే ఏడు రోజుల పాటు ప్రభుత్వ సెలవులను కూడా ప్రకటించింది.
ట్రంప్ ప్రకటనతో మొదలైన సంచలనం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారమే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “చరిత్రలోనే అత్యంత క్రూరమైన వ్యక్తులలో ఒకరైన ఖమేనీ ఇక లేరు” అని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా జరిపిన ఈ సంయుక్త ఆపరేషన్లో ఖమేనీ హతమయ్యారని ట్రంప్ తెలిపారు. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఇదొక గొప్ప అవకాశమని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఇజ్రాయెల్ వందలాది యుద్ధ విమానాలతో ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలు, క్షిపణి కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలపై విరుచుకుపడింది. టెహ్రాన్లోని ఖమేనీ నివాసం సమీపంలోనే మొదటి బాంబు దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, మనవడు, ఇరాన్ రక్షణ మంత్రి, రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్లు కూడా మరణించినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ దాడుల వల్ల సుమారు 201 మంది ప్రాణాలు కోల్పోగా, 700 మందికి పైగా గాయపడ్డారు.
ఖమేనీ మరణ వార్తను మొదట ఇరాన్ ఖండించినప్పటికీ, ఆ తర్వాత అధికారికంగా వెల్లడిచింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా భారీ ఎత్తున డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్తో పాటు బహ్రెయిన్, కువైట్, ఖతార్లలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. దుబాయ్, అబుదాబి విమానాశ్రయాల్లోనూ పేలుళ్లు సంభవించడంతో గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 1989 నుంచి ఇరాన్ను శాసిస్తున్న ఖమేనీ మరణంతో పశ్చిమ ఆసియాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తోంది.
