U19 world cup 2026 : జింబాబ్వే వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో(U19 world cup 2026) టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్ను 100 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి, రికార్డు స్థాయిలో ఆరోసారి ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన వీరబాదుడుతో ఇంగ్లాండ్ బౌలర్లను వణికించి, భారత్ విజయానికి పునాది వేశాడు.
కేవలం 80 బంతుల్లో 175 పరుగులు (15 ఫోర్లు, 15 సిక్సర్లు) చేసి సూర్యవంశీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే ఇది అత్యధిక వ్యక్తిగత స్కోరు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోరు సాధించింది.
కెప్టెన్ ఆయుష్ మాత్రే (53) కూడా రాణించాడు. భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ కష్టపడినా, భారత బౌలర్ల ధాటికి 311 పరుగులకే ఆలౌట్ అయింది. కాలేబ్ ఫాల్కనర్ (115) సెంచరీ వృథా అయింది. భారత బౌలర్లలో అంబ్రిష్ 3 వికెట్లతో రాణించగా, దీపేష్, కనిష్క్ తలో రెండు వికెట్లు తీశారు.
