BJP MLA : తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు తనకు నచ్చడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసే ప్రసక్తే లేదని రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఉత్తర తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు.
నిధులు, పదవులన్నీ దక్షిణ తెలంగాణ వారే దోచుకుపోతున్నారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్న బీజేపీ హామీని ప్రజలు తిరస్కరించి ఓడించారని అన్నారు. అందుకే తాను మళ్లీ పోటీ చేయనని చెప్పారు. రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని చేసేందుకు తాము గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి కూడా సిద్ధమని ప్రకటించారు.
ఇక కృష్ణా జలాల్లో కేవలం 299 టీఏంసీలకే అంగీకరించి సంతకం పెట్టిన మాజీ ఇరిగేషన్ మంత్రిని ఉరితీసినా తప్పులేదన్నారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడే వారికి తాలిబన్ చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేవలం అంచనాలు పెంచి అవినీతికి పాల్పడటం కోసమే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చారని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు సలహాలిచ్చే అధికారులకు కూడా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.
