Hyderabad : హైదరాబాద్‌లో షాకింగ్ ..పిల్లలకు ఇచ్చే కేకుల్లో కుళ్ళిన గుడ్లు.. జాగ్రత్త!

Hyderabad

Hyderabad : మన పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కేకులు, డోనట్లు అసలు ఎలా తయారవుతున్నాయో తెలిస్తే మీ గుండె ఆగిపోవాల్సిందే. రంగురంగుల ప్యాకింగ్‌తో ఊరిస్తున్న ఆ తినుబండారాల వెనుక ఎంతటి కుట్ర దాగి ఉందో తాజాగా బయటపడింది. హైదరాబాద్‌ శివార్లలోని కాటేదాన్‌ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఓ భారీ కల్తీ ఆహార తయారీ కేంద్రాన్ని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు రట్టు చేశారు.

కుళ్ళిపోయిన కోడిగుడ్లు, ప్రమాదకరమైన రసాయనాలతో డోనట్లు తయారు చేస్తూ చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠా గుట్టును పోలీసులు విప్పారు. ఇంద్ర సొసైటీలో మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీ పేరుతో నడుస్తున్న ఈ యూనిట్‌పై పోలీసులు మెరుపు దాడి చేశారు. అక్కడ తయారవుతున్న కేకులు, డోనట్ల కోసం కుళ్ళిపోయిన గుడ్లను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

తయారీ ఖర్చు తగ్గించుకోవడానికి ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకున్న నిర్వాహకులు.. ఆహారం చెడిపోకుండా ఉండేందుకు మోతాదుకు మించి సోడియం బెంజోయేట్, సోర్బిక్ యాసిడ్, అమ్మోనియా సల్ఫైట్ వంటి ప్రమాదకరమైన కెమికల్స్‌ను విచ్చలవిడి వాడేస్తున్నారు. ఈ ఆహారం పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఈ దాడిలో పోలీసులు సుమారు 330 కుళ్ళిన గుడ్లను, భారీ స్థాయిలో కెమికల్ పౌడర్లను, సుమారు 150 కిలోల కేకులు, డోనట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ పరిసరాలు అత్యంత అపరిశుభ్రంగా ఉండటాన్ని చూసి అధికారులే విస్తుపోయారు. ఈ కేసుకు సంబంధించి జార్ఖండ్‌కు చెందిన సూపర్‌వైజర్ అఫ్రిది అన్సారీ, మేనేజర్ యాసీన్ , ఖత్రేషన్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంపై బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.