Telangana : అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధ పరిణామాలు ఇప్పుడు తెలంగాణలోని మద్యం ప్రియు లపై ప్రభావం చూపనున్నాయి. రాష్ట్రంలో మద్యం, బీర్ల ధరలను భారీగా పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దాదాపు 12 నుండి 15 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని సమాచారం. వచ్చే మే నెల నుండే ఈ కొత్త ధరలు అమలులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి మద్యం ధరలను సవరించడం ఆనవాయితీ. చివరిసారిగా 2023 మే నెలలో ధరలు పెరిగాయి. నిబంధనల ప్రకారం 2025 మే నెలలోనే ధరలు పెరగాల్సి ఉన్నా, అప్పట్లో మద్యం కంపెనీలు ధరలను పెంచలేదు. ఇప్పుడు ధరల సమీక్ష గడువు ముగిసి ఏడాది దాటిపోవడంతో, ఈసారి కచ్చితంగా రేట్లు పెంచాలని కంపెనీలు పట్టుబడుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల వల్ల గ్యాస్ కొరత ఏర్పడటమే కాకుండా, సీసాల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గింది. ముడిసరుకు ధరలు, రవాణా ఖర్చులు పెరగడంతో ప్రస్తుత ధరలకు మద్యం సరఫరా చేయడం కష్టమని కంపెనీలు చెబుతున్నాయి. అందుకే మే నెల నుండి రేట్లు పెంచడం ఖాయమని తెలుస్తోంది.
ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయంటే?
కింగ్ఫిషర్ (KF) లైట్: రూ. 180
కింగ్ఫిషర్ (KF) స్ట్రాంగ్: రూ. 190
బడ్వైజర్: రూ. 230
బడ్వైజర్ మాగ్నమ్: రూ. 250
వచ్చే నెల నుండి ఈ ధరలపై 15 శాతం వరకు అదనపు భారం పడనుంది. అయితే, రేట్లు ఎంత పెరిగినా సరే.. సమ్మర్ హీట్ను తట్టుకోవడానికి బీర్లు తాగక తప్పదని, తమకు తగ్గేదేలే అని మందుబాబులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
