Vemulawada : చనిపోయిన అభ్యర్థి సర్పంచ్ గా గెలిచిండు

VEMULAWADA
vemulawada : తెలంగాణలో వెలువడుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వేములవాడ మండలంలోని చింతల్‌ఠాణా గ్రామంలో ఇటీవల చనిపోయిన సర్పంచ్ అభ్యర్థికి అధిక ఓట్లు వచ్చాయి. ఆయనకు తన సమీప అభ్యర్థిపై 300కు పైగా ఓట్ల అధికంగా వచ్చాయి. ఐదు రోజుల క్రితం గుండెపోటుతో సర్పంచ్‌ అభ్యర్థి చెర్ల మురళీ (53) మృతిచెందారు. ఆయనకే అత్యధిక ఓట్లు రావడంతో ఫలితం ప్రకటనపై అధికారుల తర్జనభర్జన పడుతున్నారు.

ఫలితం ప్రకటించకుండా ఉన్నతాధికారి ఆదేశం కోసం ఆర్వో వెయిట్ చేస్తున్నారు.సర్పంచ్ అభ్యర్థి మృతి చెందినప్పటికీ ఎన్నికల నియమావళిలో భాగంగా పోలింగ్ యథావిధిగా కొనసాగింది. తమ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఫ్యానల్‌కు చెందిన పదిమంది వార్డుమెంబర్‌ అభ్యర్థులు పట్టుదలతో స్థానిక నాయకులతో కలిసి పనిచేశారు. చెర్ల మురళీకి మంచి పేరుంది. ఆయన మృతి పట్ల గ్రామస్తులు కూడా సానుభూతి వ్యక్తం చేస్తూ ఆయనకే మద్దతు తెలిపారు.

మురళికి గురువారం రాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు, అక్కడ నుండి కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అయితే, కరీంనగర్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో ఆయన తుది శ్వాస విడిచారు. సర్పంచ్‌గా గెలిచి గ్రామస్థులకు సేవ చేయాలన్న తన కల నెరవేరకుండానే ఆయన అర్ధాంతరంగా తనువు చాలించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి తండ్రి గుంటకండ్ల రామచంద్రారెడ్డివిజయం సాధించారు. సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచి అభ్యర్థిగా బీఆర్ఎస్ మద్దతుతో బరిలో నిలిచారు. 95 ఏళ్ల వయసులోనూ ఆయన ప్రచారం చేసి ఆకట్టుకున్నారు. శేష జీవితం గ్రామాభివృద్ధికి అంకితం చేయాలనేదే తన ఆకాంక్ష అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.