Bandi Sanjay : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఉపఎన్నిక హిందూ, ముస్లింల మధ్య జరుగుతున్న వార్ అని సంజయ్ అన్నారు. మొలతాడు ఉన్నోళ్లకు, లేనోళ్లకు, బొట్టు పెట్టుకున్నోళ్లకు, పెట్టుకోనోళ్లకు మధ్య పోటీ అని ఆయన అభివర్ణించారు. ఈ ఎన్నికలలో 80% ఉన్న హిందువులు గెలుస్తారా? 20% ఉన్న ముస్లింలా? హిందువుల పక్షాన బీజేపీ, ముస్లింల వైపు కాంగ్రెస్ ఉందన్నారు. తెలంగాణని ఇస్లామిక్ స్టేట్గా మార్చేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు.
మరోవైపు గోదావరిఖనిలో రోడ్డు విస్తరణలో భాగంగా 46 ఆలయాల కూల్చివేతపై బండి సంజయ్ స్పందించారు. అమ్మవారి ఆలయాలను ఎలా కూల్చేశారో.. అలాగే రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను కూడా కూల్చివేయాల్సిందేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయనహెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయిపోగానే తానే స్వయంగా గోదావరిఖని వస్తానని.. అధికారుల సంగతి తేలుస్తానన్నారు సంజయ్. ఆలయాలను కట్టించకపోతే రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులన్నింటినీ కూల్చివేయిస్తానంటూ సంజయ్ కామెంట్స్ చేశారు.
ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లిం టోపీ ధరించడంపై బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఇప్పటికే సంచలనంగా మారాయి.”ఒకవేళ ఓట్ల కోసం నేను ఎప్పుడైనా టోపీ పెట్టుకోవాల్సి వస్తే, నేను తలనే నరుక్కుంటాను. నేను కచ్చితంగా హిందువును. ఇతర మతాలను అవమానించేలా నమాజ్ నటించను” అని ఘాటుగా సంజయ్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్, AIMIMలు మైనారిటీల ఓట్ల కోసం బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. దీనికి ప్రతిగా (హిందూ) సమాజం ఒకే ఓటు బ్యాంకుగా ఏర్పడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక మాజీ ఎమ్మెల్యే మగంటి గోపీనాథ్ మరణంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే బండి సంజయ్ ఈసీ నిబంధనలను ఉల్లంఘించారని కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.
