Balapur: బాలాపూర్ ల‌డ్డూకు రికార్డు ధ‌ర‌.. ఎవరీ లింగాల ద‌శ‌ర‌థ్ గౌడ్‌?

Balapur: బాలాపూర్ ల‌డ్డూకు రికార్డు ధ‌ర‌ పలికింది. వేలంపాట‌లో రూ.35 ల‌క్షల‌కు క‌ర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల ద‌శ‌ర‌థ్ గౌడ్‌ ద‌క్కించుకున్నారు. గత ఆరు  సంవత్సరాలుగా ఆయన ఈ లడ్డూ కోసం పోటీ పడుతున్నారు. గ‌తేడాదికంటే రూ.4.99 ల‌క్షలు అధికంగా ప‌లికింది. బాలాపూర్ లడ్డూ ఈ సారి దక్కించుకున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు లింగాల ద‌శ‌ర‌థ్ గౌడ్‌ .

గతేడాది బీజేపీ నేత కొలను శంకర్ రెడ్డి కొనుగోలు చేశారు. బాలాపూర్ ల‌డ్డూ వేలం పాట ప్రతి ఏటా పెరుగుతుంది.1994లో 450రూపాయలతో మొదలైన లడ్డూ వేలం.. 31ఏళ్లుగా కొనసాగుతుంది. తాజాగా రూ.35 ల‌క్షల‌తో రికార్డు సృష్టించింది. బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న వారికి సంపద, అదృష్టం, శ్రేయస్సు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ వేలంలో గెలుచుకున్న మొత్తాన్ని బాలాపూర్ గ్రామాభివృద్ధి కోసం ఉపయోగిస్తారు.

లింగాల దశరథ్ గౌడ్ ఒక వ్యాపారవేత్త,రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. ఆయనకు క‌ర్మన్‌ఘాట్‌లో సిమెంట్, స్టీల్ షాపులున్నాయి. ఆయనకు ఏ పార్టీతో సంబంధం లేదు.  గతంలో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న కొలన్ రామ్ రెడ్డికి ఈయన బంధువు. ప్రతి సంవత్సరం వేలంలో ఉత్సాహంగా పాల్గొని, లడ్డూను గెలుచుకోవాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. గత ఆరేళ్లుగా ఆయన నిరంతరంగా ఈ వేలంలో పాల్గొంటున్నారు.

ఈ సంవత్సరం (2025) రికార్డు ధర రూ. 35 లక్షలకు లడ్డూను దక్కించుకోవడం ద్వారా ఆయన వార్తల్లో నిలిచారు. ఈ లడ్డూను గెలుచుకున్న తర్వాత, ఆయన చాలా సంతోషంగా ఉన్నానని, ఈ విజయం తమ కుటుంబానికి, వ్యాపారానికి శుభం చేకూరుస్తుందని ఆశిస్తున్నట్లుగా తెలిపారు.