BCCI సంచలన నిర్ణయం.. విమెన్ బ్లూ టీమ్కు జాక్ పాట్!

bcci

BCCI : ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి చరిత్ర సృష్టించింది భారత్.. ఈ చారిత్రక విజయాన్ని నమోదు చేసిన భారత మహిళా క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారీ నజరానా ప్రకటించింది. ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు ఏకంగా రూ. 51 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవ్జీత్ సైకియా అధికారికంగా వెల్లడించారు.

ఐసీసీ నుంచి ప్రపంచ కప్ గెలిచిన విజేత జట్టుకు లభించే ప్రైజ్ మనీ రూ.39.55 కోట్లు.. వీటితో పాటుగా, బీసీసీఐ ప్రకటించిన ఈ రూ.51 కోట్ల బోనస్ భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుంది. రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికాకు USD 2.24 మిలియన్లు (సుమారు రూ. 20 కోట్లు) బహుమతిగా లభించింది, ఓడిపోయిన సెమీఫైనలిస్టులు ఒక్కొక్కరు USD 1.12 మిలియన్లు (సుమారు రూ. 10 కోట్లు) అందుకున్నారు.

ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులోని ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది అందరికీ ఈ నగదు అందుతుంది. ఈ సందర్భంగా సైకియా మాట్లాడుతూ, 1983లో కపిల్ దేవ్ సారథ్యంలోని పురుషుల జట్టు ఎలా అయితే దేశంలో కొత్త ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని తీసుకొచ్చిందో, ఇప్పుడు భారత మహిళా జట్టు కూడా అలాంటి ఉత్తేజాన్ని తీసుకొచ్చింది. ఈ విజయం భవిష్యత్ తరాల మహిళా క్రికెటర్లకు మార్గం సుగమం చేస్తుందని తెలిపారు.

కాగా నవంబర్ 02వ తేదీన హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని విమెన్ ఇన్ బ్లూ టీమ్ ఫైనల్‌లో 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి, వన్డే, టీ20 ఫార్మాట్‌లలో తమ తొలి ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది.

జై షా బీసీసీఐ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి (2019 నుండి 2024 వరకు బీసీసీఐ కార్యదర్శిగా పనిచేశారు) మహిళల క్రికెట్‌లో అనేక మార్పులు తీసుకొచ్చారు. గత నెలలో జై షా మహిళల ప్రైజ్ మనీని 300 శాతం పెంచారు. ప్రైజ్ మనీ గతంలో $2.88 మిలియన్లు ఉండగా, ఇప్పుడు దానిని $14 మిలియన్లకు పెంచారు. ఈ చర్యలన్నీ మహిళా క్రికెట్‌కు భారీ ప్రోత్సాహాన్నిచ్చాయని చెప్పాలి.