BCB Controversy : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలనం.. ప్లేయర్లను నమ్మంచి మోసం!

BCB Controversy

BCB Controversy : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చేస్తున్న పనులు చూస్తుంటే ఆ దేశ క్రికెట్ అభిమానులు నోరెళ్లబెడుతున్నారు. ఓ పక్క భారత్‌కు రానని మంకుపట్టు పట్టి, ఏకంగా 2026 టీ20 వరల్డ్ కప్ ఆడే అవకాశాన్నే బంగ్లాదేశ్(BCB Controversy) పోగొట్టుకుంది. ఐసీసీ ఆ జట్టును టోర్నీ నుంచి తీసేసి స్కాట్లాండ్‌ను చేర్చుకుంది. ఈ షాక్ నుంచి కోలుకోకముందే, బోర్డు తన ప్లేయర్లకు పెద్ద వెన్నుపోటు పొడిచింది. తమను అవమానించినందుకు పదవి నుంచి తీసేసిన ఒక వ్యక్తిని, మళ్ళీ అదే సీట్లో కూర్చోబెట్టింది.

అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే.. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ “వరల్డ్ కప్ గొడవలు వద్దు, భారత్‌తో మాట్లాడి పరిష్కరించుకుందాం” అని మంచి సలహా ఇచ్చాడు. దీనికి బోర్డు ఫైనాన్స్ కమిటీ చీఫ్ నజ్ముల్ ఇస్లాం రెచ్చిపోయి, తమీమ్‌ను ఇండియా ఏజెంట్ అంటూ తిట్టాడు. అంతేకాదు, ఆటగాళ్లకు ఇచ్చే డబ్బులు వెనక్కి తీసుకోండి, వాళ్లకు జీతాలు అనవసరం అంటూ నోరు పారేసుకున్నాడు. దీంతో రగిలిపోయిన బంగ్లాదేశ్ క్రికెటర్లందరూ కలిసి మాకు గౌరవం లేని చోట ఆడమంటూ ఆ దేశ లీగ్ (BPL) ను బహిష్కరించారు.

లీగ్ ఆగిపోతే నష్టం వస్తుందని భయపడి, అప్పట్లో బోర్డు నజ్ముల్‌ను పదవి నుంచి తీసేసింది. బోర్డు తమ మాట విందని నమ్మి ప్లేయర్లు మళ్ళీ బ్యాట్లు పట్టారు. కానీ, ఇప్పుడు వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ టీమ్ బయటకు రాగానే.. బోర్డు తన అసలు బుద్ధి చూపించింది. నజ్ముల్ చెప్పిన సంజాయిషీ నచ్చిందంటూ, మళ్ళీ ఆయనకే ఫైనాన్స్ బాధ్యతలు అప్పగించింది.

అంటే, ప్లేయర్ల గౌరవం కంటే బోర్డులోని పాత మనుషులకే ఎక్కువ విలువిచ్చింది. వరల్డ్ కప్ పోయింది, ఇప్పుడు ఉన్న ప్లేయర్ల నమ్మకం కూడా పోయింది.. బంగ్లాదేశ్ క్రికెట్ పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది.