Vizag : వైజాగ్ జిల్లా భీమిలిలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, 26 ఏళ్ల శ్యామ్ కుమార్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతను భీమిలిలోని ఒక హోటల్ గదిలో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గదిలో మద్యం బాటిళ్లు, ఎలుకల మందు లభించడాన్ని బట్టి అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. గత ఆరేళ్లుగా సాగుతున్న ఒక ప్రేమ వ్యవహారం విఫలమవ్వడం, వరుసగా జరిగిన విషాద పరిణామాలే ఈ మృతికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
శ్యామ్ కుమార్ గత ఆరేళ్లుగా హైదరాబాద్లోని జీడిమెట్లకు చెందిన పావని అనే యువతితో ప్రేమలో ఉన్నాడు. అయితే వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించకపోవడంతో గతంలోనే పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే సుమారు వారం రోజుల క్రితం మనస్తాపానికి గురైన పావని ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది.
విశాఖ : భీమిలి సాగరతీరం హోటల్ గదిలో వ్యక్తి అనుమానాస్పద మృతి..!
మృతుడు విశాఖ పాత పోస్టాఫీస్ ప్రాంతానికి చెందిన శ్యామ్కుమార్ (26)గా గుర్తింపు.
హోటల్ గదిలో మద్యం సీసాలు, ఎలుకల మందుతో పాటు ఫ్యాన్కు ఉరివేసుకున్నట్లు ఆనవాళ్లు.
మృతుని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి, దర్యాప్తు…
— Neti Telugu (@NetiTeluguNews) February 21, 2026
తన కూతురు మరణానికి శ్యామ్ కుమారే కారణమని ఆరోపిస్తూ పావని తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శ్యామ్పై కేసు నమోదు చేశారు. అప్పటికే ఆనందపురం పోలీస్ స్టేషన్లో శ్యామ్పై ఒక పోక్సో కేసు కూడా నమోదై ఉండటం గమనార్హం.
ప్రేమించిన యువతి దూరం కావడం, మరోవైపు వరుసగా పోలీస్ కేసులు నమోదు కావడంతో శ్యామ్ కుమార్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి విశాఖకు చేరుకున్న అతను, భీమిలిలోని హోటల్లో మరణాన్ని ఆశ్రయించాడు. .
పావని లేని లోకంలో తాను ఉండలేననే ఆవేదనతోనే అతను ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం భీమిలి పోలీసులు ఈ కేసును నమోదు చేసి, ప్రేమ వ్యవహారం నుండి ఆత్మహత్య వరకు దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లోనూ లోతైన విచారణ జరుపుతున్నారు.
