Maharashtra : నేనే శివుడ్ని.. నువ్వు పార్వతివి: మహిళపై అత్యాచారం చేసిన నకిలీ బాబా!

maharashtra

Maharashtra :  మహారాష్ట్రలో భక్తి పేరుతో అరాచకాలకు పాల్పడుతున్న మరో నకిలీ బాబా బండారం బయటపడింది. తాను సాక్షాత్తూ పరమశివుడి అవతారానినని, సదరు మహిళ తన పార్వతి అని నమ్మించి ఓ 35 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక కేటుగాడు. పాల్ఘర్ జిల్లాకు చెందిన రిషికేశ్ వైద్య (40) అనే ఈ నిందితుడు, పుణెకు చెందిన మహిళను ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు.

2023లో ఆమెను కలిసిన సమయంలో తనకు దైవశక్తులు ఉన్నాయని నమ్మించి, మత్తుమందు ఇచ్చి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

అంతటితో ఆగకుండా, ఆమెకు తెలియకుండా ఫోటోలు తీసి వాటితో బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. గతేడాది మే నెలలో వసాయ్‌లోని ఒక హోటల్‌కు పిలిపించి మళ్ళీ ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. అయితే, ఇటీవల నాసిక్‌లో కెప్టెన్ ఖారత్ అనే మరో నకిలీ బాబా అరెస్ట్ కావడంతో, ఆ ధైర్యంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

ఘటన పుణెలో జరగడంతో మానిక్‌పూర్ పోలీసులు ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేసి, తదుపరి విచారణ కోసం కేసును పుణె పోలీసులకు బదిలీ చేశారు. ఇలాగే మరికొందరు మహిళలను కూడా ఇతడు మోసం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.