Deadline Looms :అమెరికా-ఇరాన్ మధ్య మరో రౌండ్ చర్చలు..ఎప్పుడంటే?

Deadline Looms

Deadline Looms : అమెరికా,ఇరాన్ మధ్య మరో విడత చర్చలు ఈ గురువారం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత వారాంతంలో ఇస్లామాబాద్‌లో జరిగిన సుదీర్ఘ చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ, వచ్చే వారం కాల్పుల విరమణ గడువు ముగిసేలోగా ఒక ఒప్పందానికి రావాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి.  ఇరు దేశాల ప్రతినిధులు ముఖాముఖి భౌతికంగా కలవడానికి సిద్ధంగా ఉన్నారని, దీనిపై ఇప్పటికే ఒక ప్రాథమిక అంగీకారం కుదిరిందని దౌత్య వర్గాలు చెబుతున్నాయి.

ఇస్లామాబాద్‌లోనే ఈ సమావేశం

అయితే, ఈ చర్చల సమయం, ఎవరెవరు పాల్గొంటారు. చర్చల విధానంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ప్రస్తుతానికి మళ్లీ ఇస్లామాబాద్‌లోనే ఈ సమావేశం నిర్వహించాలా లేక స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరపాలా అనే అంశంపై ఆలోచనలు సాగుతున్నాయి. ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగితే గురువారం నాడే ఈ భేటీ ఉండవచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్‌తో మాట్లాడటానికి తాను సిద్ధమేనని ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఇరాన్ వైపు నుంచే తమకు సమాచారం వచ్చిందని, వారు ఒక ఒప్పందానికి రావాలని కోరుకుంటున్నారని ట్రంప్ విలేకరులతో వ్యాఖ్యానించారు.

గత శని, ఆదివారాల్లో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో దాదాపు 21 గంటల పాటు మారథాన్ చర్చలు జరిగాయి. ఇందులో పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్, ఒమన్ దేశాల ప్రతినిధులు మధ్యవర్తులుగా వ్యవహరించారు. ఇంత సమయం వెచ్చించినా కూడా ప్రధాన అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. అమెరికా వైపు నుంచి కొన్ని కఠినమైన షరతులు ఉన్నాయి. ముఖ్యంగా రాబోయే 20 ఏళ్ల పాటు ఇరాన్ యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయాలని, దెబ్బతిన్న అణు కేంద్రాలను తొలగించాలని నిల్వ ఉన్న అణు ఇంధనంపై స్పష్టత ఇవ్వాలని వాషింగ్టన్ పట్టుబడుతోంది.

మరోవైపు, ఇరాన్ ఈ షరతులను ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. అమెరికా ఇప్పటికే ఇరాన్ రేవులపై నౌకాదళ దిగ్బంధనం విధించి ఒత్తిడి పెంచుతుండగా, ఇరాన్ కూడా ప్రపంచ చమురు సరఫరాను అడ్డుకోగల తన వ్యూహాత్మక బలాన్ని నమ్ముకుంటోంది. యుద్ధం గనుక సుదీర్ఘంగా సాగితే ఆర్థికంగా,  రాజకీయంగా భారీ నష్టం జరుగుతుందనే ఆందోళన అమెరికా ప్రభుత్వ వర్గాల్లో కూడా వ్యక్తమవుతోంది. ఈ ఉద్రిక్తతల మధ్య గురువారం జరగబోయే చర్చలు శాంతికి దారితీస్తాయా లేదా అనేది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది.