CM Revanth Reddy : చంద్రబాబుపై సీఎం రేవంత్ సెన్సేషనల్ కామెంట్స్!

CM Revanth Reddy

CM Revanth Reddy :  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీజేపీతో జట్టు కట్టిన ప్రాంతీయ పార్టీల పరిస్థితిని ఉదాహరణలతో విశ్లేషించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ ప్రాంతీయ పార్టీ కూడా భవిష్యత్తులో మనలేదని రేవంత్ పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణగా నితీష్ కుమార్, ఏకనాథ్ షిండేల పరిస్థితిని ప్రస్తావిస్తూ.. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి సొంతంగా పూర్తి మెజారిటీ (సీట్లు) తక్కువగా ఉండటం వల్లే టీడీపీకి ప్రాధాన్యత ఇస్తున్నారని, రేపు భవిష్యత్తులో బీజేపీకి బలం పెరిగితే చంద్రబాబును కూడా పక్కన పెట్టడం ఖాయమని జోస్యం చెప్పారు. లోక్‌సభ, రాజ్యసభలు చట్టాలు చేయడానికే ఉన్నాయని, కానీ వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలేనని రేవంత్ గుర్తు చేశారు.

కేవలం 2/3 వంతు మెజారిటీ ఉన్నంత మాత్రాన ఇష్టానుసారం చట్టాలు చేస్తామంటే కుదరదని, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. “ఏపీలో ప్రతిపక్షానికి 11 సీట్లే ఉన్నాయని, చంద్రబాబు తానే రాజునని కొత్త చట్టాలు తెస్తే ప్రజలు ఒప్పుకుంటారా?” అని ప్రశ్నిస్తూ డిక్టేటర్ షిప్‌ను ఎవరూ సహించరని అన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలుపై స్పందిస్తూ.. 2011 జనాభా లెక్కల ప్రకారమే మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు.