Lucknow: పెళ్లై ఏడాది.. ప్రాణం తీసిన బెట్టింగ్.. 11వ అంతస్తు నుండి దూకి!

Lucknow

Lucknow : లక్నోలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐపీఎల్ బెట్టింగ్‌లో భారీగా డబ్బులు నష్టపోవడంతో ప్రాబల్ జైన్ (31) అనే ప్రాపర్టీ డీలర్ తన అపార్ట్‌మెంట్‌లోని 11వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం రాత్రి కుర్సీ రోడ్డులోని జనేశ్వర్ ఎన్‌క్లేవ్‌లో ఈ ఘటన జరిగింది.

సీతాపూర్ జిల్లాకు చెందిన ప్రాబల్ జైన్, తన భార్యతో కలిసి లక్నోలో నివసిస్తున్నారు. గురువారం జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ ఐపీఎల్ మ్యాచ్‌పై ఆయన భారీగా బెట్టింగ్ కట్టినట్లు సమాచారం. ఆ బెట్టింగ్‌లో లక్షలాది రూపాయలు పోగొట్టుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మ్యాచ్ జరుగుతుండగానే తన భార్యకు ఫోన్ చేసి, తాను సర్వం కోల్పోయానని ఏడుస్తూ చెప్పారు. ఆమె అతడిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, అప్పటికే తీవ్ర ఆవేదనలో ఉన్న ప్రాబల్ 11వ అంతస్తు బాల్కనీ నుండి కిందకు దూకేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రాబల్ జైన్ దంపతులకు వివాహమై ఏడాది మాత్రమే అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.